ప్రస్తుతం టీఆర్ఎస్లో ఈటల అంశం సెగలు రేపుతోంది. ఈటలను విమర్శించడంలో నేతలు క్యూ కడుతున్నారు. ఈ జాబితాలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే కోవలో సీనియర్ నేత కడియం శ్రీహరి సైతం ఈటలపై విమర్శలు ఎక్కుపెట్టడం ఆసక్తిగా మారింది. ఈటల కమ్యూనిస్ట్ కాదు ఫ్యూడలిస్ట్ అని ఆయన విరుచుకుపడ్డారు. సోషలిస్ట్ అంటూనే అక్రమాలకు పాల్పడ్డారని విమర్శల డోస్ కూడా పెంచారు. ఈ స్థాయిలో శ్రీహరి మాటల దాడి చేయడం వెనక కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీస్తే అసలు విషయం బోధపడింది.

తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అయ్యాయి. షెడ్యులు ప్రకారం ఇదే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ కోటాలో గతంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై పదవీకాలం ముగిసిన నాయకుల్లో మాజీ డిప్యూటీ సీఎం..టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి కూడా ఉన్నారు. దీంతో ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవీయోగం ఉందా లేదా అని గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోంది. అందుకే ఈటలపై కడియం విమర్శల దాడి పెంచారన్న చర్చ నడుస్తుంది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటి చేసి ఎంపీగా ఎన్నికయ్యారు కడియం శ్రీహరి. అయితే అనూహ్య రాజకీయ పరిణామాలతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెనువెంటనే డిప్యూటీ సీఎంగా అనుకోని పదవి వరించింది. ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు శ్రీహరి. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేబినెట్లో చోటు దక్కలేదు. దాంతో ఎమ్మెల్సీగానే ఉండిపోయారాయన. ఇప్పుడు చేతిలో ఎలాంటి పదవి లేదు. అధిష్ఠానం ఫ్రేమ్లో ఉన్నారో లేదో కూడా తెలియదు. పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందో లేదో డౌటే అని తెలుస్తుంది.
ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాతో కలిపి ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిల్లో టీఆర్ఎస్ ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. పార్టీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. ఎవరిస్థాయిలో వారు లాబీయింగ్ చేస్తున్నారు కూడా. పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వొచ్చన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ నాయకత్వంపట్ల విధేయతతోపాటు పార్టీ భవిష్యత్ అవసరాలకు ఎంతవరకు ఉపయెగపడతారన్న అంశాలను వడపోస్తున్నట్టు తెలుస్తోంది.