సుదీర్ఘ సర్వే అనంతరం పోటీచేసే స్థానాల పై నిర్ణయం తీసుకున్నారు జనసేనాని. మేధావులు, నిపుణుల సూచనలతో రెండు చోట్ల పోటీకి పవన్ సముఖత వ్యక్తం చేశారు. ఎనిమిది నియోజకవర్గాల్లో జనసేనాని పోటీ పై సర్వే చేసిన పార్టీ కోర్ టీం వాటిని ఫైనల్ గా గాజువాక, భీమవరం ను ఓకే చేశారు. ఇక టీడీపీకి వైసీపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్న జనసేనాని నిర్ణయాలు మాత్రం ఎన్నికల వేళ ఆసక్తికరంగా ఉన్నాయి. వామపక్షాలు మినహా ఎవరితోనూ పొత్తు ఉండదని చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ వెళ్లి మరీ బీఎస్పీ తో పొత్తు కలుపుకొని వచ్చారు. మాయావతిని ప్రధాన మంత్రిగా చూడాలనేది తన కల అంటూ సీపీఐ, సీపీఎం పార్టీల కంటే బీఎస్పీకి ఆయన ఎక్కువ స్థానాలు కేటాయించడం ఆసక్తికరంగా మారింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే అంశంపై స్పష్టత వచ్చింది. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ నగర పరిధిలోని గాజువాక శాసనసభ స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారు. తన పోటీపై జనసేన పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని, ఎక్కడ నుంచి పోటీ చేసేది ఈరోజు వెల్లడిస్తానన్న పవన్ దీనిపై ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చారు. పవన్ ఎక్కడ నుంచి పోటీచేయాలనే అంశంపై జనరల్ బాడీ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. ఇందులో అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం నియోజకవర్గాలు తొలి స్థానంలో నిలిచాయి. ఈ ఎనిమిదింటిపై అంతర్గత సర్వే నిర్వహించిన మేధావులు, రాజకీయ పరిశీలకులు చివరకు గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీచేయాలని పవన్కు సూచించారు. వారి ప్రతిపాదనలకు పవన్ సానుకూలంగా స్పందించారు.
అంతా బాగానే ఉన్నా సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఆలోచన రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాల కంటే బీఎస్పీని పవన్ బలమైన పార్టీగా భావిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం వామపక్ష పార్టీల ప్రభావం చాలా తక్కువగా ఉంది. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం రెండు పార్టీలూ ఒక్కో శాతం ఓట్లను కూడా సాధించుకోలేకపోయాయి. ప్రజా పోరాటాల్లో ముందుండే ఆ పార్టీలు ఎన్నికల విషయానికి వచ్చే సరికి వెనుకబడుతున్నాయి. దీంతో ఈ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. వాస్తవానికి ఏపీలో కంటే తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం కొంచెం ఎక్కువ. తెలంగాణలో ప్రజాకూటమిలో భాగంగా సీపీఐకి కేవలం 3 స్థానాలు మాత్రమే వదిలేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటిది ఆంధ్రలో పవన్ కళ్యాణ్ ఏకంగా ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను ఆ పార్టీకి కేటాయించారు. సీపీఎం పార్టీకీ ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించి సమ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే, ఆ రెండు పార్టీలకు గెలిచే స్థాయిలో బలం ఉందా అనేది అనుమానమే.
ఇక, అంతో ఇంతో ప్రజల్లో ఉండే వామపక్షాలకు ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే బహుజన సమాజ్ పార్టీకి ఏకంగా 21 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ పార్టీకి ఏపీలో ఏ మాత్రం బలం లేదు. అభ్యర్థులు సైతం దొరకని పరిస్థితి. కేవలం ఎవరైన బలమైన అభ్యర్థులు టిక్కెట్లు ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు దొరకకపోతే ఏనుగు గుర్తు ప్రజల్లోకి వెళుతుంది అన్న ఏకైక ఉద్దేశ్యంతో ఆ పార్టీ బీఫాంపై పోటీ చేసి కాస్తో కూస్తో ఓట్లు తెచ్చుకుంటారు. కొందరు స్వంత బలంతో విజయం సాధిస్తారు. అంతేకానీ ఆ పార్టీకి ఏపీలో కానీ, తెలంగాణలో కానీ పెద్దగా బలం లేదు. అయితే, దళితుల్లో ఆ పార్టీకి ఆదరణ ఉంటుంది. ఈ ఉద్దేశ్యంతోనే దళితుల ఓట్ల కోసం ఆయన బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారనేది స్పష్టమవుతోంది. అయితే, ఆ పార్టీకి చాలా ఎక్కువ స్థానాలు కేటాయించారని అంటున్నారు. ఇక, పొత్తుల్లో బాగంగా పవన్ కళ్యాణ్ వదులుకుంటున్న సీట్ల విషయమై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మంగళగిరిలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. అటువంటి స్థానాన్ని సీపీఐ పార్టీకి వదిలేశారు. వాస్తవానికి, ఇక్కడ సీపీఐ కంటే సీపీఎం బలంగా ఉంది. 1994 ఆ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. 1999లోనూ రెండు స్థానంలో నిలిచింది. మరి ఈ స్థానాన్ని జనసేన, సీపీఎం కంటే బలహీనంగా ఉన్న సీపీఐకు ఎందుకు కేటాయించారో తెలియడం లేదు. అయితే, టీడీపీ తరపున నారా లోకేష్ పోటీ చేస్తున్నందున ఆయన విజయానికి ఇబ్బంది ఉండకుండానే ఈ స్థానాన్ని సీపీఐకు కేటాయించారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తానికి పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ లెక్కలు అంతుచిక్కకుండా ఉన్నాయి.