టీడీపీని వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టమని పార్టీ ఆదేశించినా ఆయన సైలెంట్ మోడ్ లో ఉన్నారట. కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక బీజేపీకి ఇంకా దూరం అయ్యారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఉన్న అదే సామాజికవర్గానికి చెందిన నాయకుడితో వచ్చిన విభేదాలే మోత్కుపల్లి ఎగ్జిట్ కి కారణమని తెలుస్తుంది. అందుకే పార్టీ వద్దన్నా కేసీఆర్ అఖిలపక్ష భేటీకి వెళ్లారు. అనంతరం సొంత పార్టీ నేతల పై మాటల తూటలు పేల్చారు.

ఈటల బీజేపీలో చేరిన సందర్భంగా ఆయనకు బాసటగా అనేక మంది బీజేపీ నేతలు మాట్లాడినా..ఆ జాబితాలో మోత్కుపల్లి చేరలేదు. తాజాగా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి మోత్కుపల్లి నర్సింహలు హాజరయ్యారు. ఆల్పార్టీ భేటీని బీజేపీ బహిష్కరించింది. ఆ సమావేశానికి మోత్కుపల్లికి ఆహ్వానం ఉందని తెలియడంతో పార్టీ నేతలు ఆయనకు ఫోన్ చేసి బీజేపీ నిర్ణయం గురించి చెప్పారట. అయినప్పటికీ అఖిలపక్ష భేటీకి వెళ్లారు మాజీ మంత్రి. ఈ పరిణామంపై పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది.
ఇదే సమయంలో మోత్కుపల్లి గురించి బీజేపీలో మరో చర్చ జరుగుతోంది. త్వరలో ఆయన బీజేపీకి రాంరాం చెబుతారనే ప్రచారం నడుస్తోంది. ఆయన పార్టీలో కొనసాగకపోవచ్చని ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. మోత్కుపల్లి మాత్రం తాను బీజేపీలోనే ఉంటానని చెబుతున్నారు. తనను విమర్శించిన వారికి కూడా ఈ సందర్భంగా పరోక్షంగా చురకలు వేశారు మోత్కుపల్లి. వ్యాపారాల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ను ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారని కూడా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఇండైరెక్ట్ గా మాజీ ఎంపీ వివేక్ ని టార్గెట్ చేశారన్న చర్చ నడుస్తుంది.
మోత్కుపల్లి టీడీపీ నుంచి బీజేపీలో చేరినా పార్టీలో ఇమడలేకపోయారు. మొదట టీఆర్ఎస్ లో చేరికకు ఆసక్తి చూపినా అటు నుంచి ఎలాంటి హామి లభించకపోవడంతో కమలం గూటికి చేరారు. అఖిలపక్ష భేటీకి వెళ్లడాన్ని సమర్ధించుకుంటూ ఆయన చేసిన కామెంట్స్ కాషాయ శిబిరంలో మరింత చర్చకు దారితీస్తున్నాయి. సమావేశానికి వెళ్లడం పై పార్టీ వివరణ అడక్కముందే తానే బీజేపీ నేతలను ఇరకాటంలో పెట్టేలా ప్రకటనలు చేశారు మోత్కుపల్లి. మోత్కుపల్లి విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.