మంజీరా పరవళ్ళ మెతుకు సీమలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల్లో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలని శాసిస్తున్న ఈ జిల్లాలో గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది గులాబీ పార్టీ ఇప్పుడు మళ్ళీ అవే ఫలితాలను రిపీట్ చేయాలనుకుంటుంది. మెదక్ లో తిరిగి పట్టుబిగించేందుకు అస్త్రశాస్త్రాలను సిద్దం చేస్తుంది ఇటు హస్తం పార్టీ . కాంగ్రెస్ హేమాహేమీల జిల్లా! టీఆర్ఎస్ అగ్ర నేతల ఖిల్లా! అయిన ఈ జిల్లాలో జరగబోయే బిగ్ ఫైట్ పై తెలుగుపాపులర్ టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్…
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్లో పోరు రసవత్తరంగా మారనుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కేసీఆర్ చేతిలో 19,029 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి 33,998 ఓట్లు సాధించారు. ఇప్పుడు ప్రతాప్రెడ్డి, నర్సారెడ్డి ఇద్దరూ కాంగ్రెస్లోనే ఉన్నారు. ప్రతాప్రెడ్డి ఇప్పటికే కూటమి తరుపున ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక నియోజకవర్గంలో తిరుగులేదంటున్న కేసీఆర్ మేనల్లుడు హరీశ్ తో నియోజకవర్గంలో మత్రాంగం నడుపుతున్నాడు. జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కె.మానిక్రావుపై ఆమె 814 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. టీఆర్ఎస్ ఈసారి కూడా మానిక్రావునే నిలిపింది. ఇక్కడ హోరాహోరి పోరు తప్పేటట్లు లేదు.
నర్సాపూర్ లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే సునీతారెడ్డి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మదన్రెడ్డి చేతిలో 14,161 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా మదన్రెడ్డి ఇప్పటికే ఖరారు కాగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతారెడ్డి మరోసారి బరిలో దిగనున్నారు. ఇక్కడ మదన్ రెడ్డి కంటే హస్తం పార్టీ అభ్యర్ధి సునితారెడ్డికి కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. దుబ్బాకలో టీఆర్ఎస్ తరఫున ఇప్పటికే సోలిపేట రామలింగారెడ్డి ప్రచారం ప్రారంభించేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ముత్యం రెడ్డి కాంగ్రెస్ టికెట్ రేసులో ముందున్నారు. శ్రవణ్కుమార్ రెడ్డి, మద్దుల నాగేశ్వర్ రెడ్డి, బండి నర్సాగౌడ్ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ స్టార్ క్యాపైనర్ విజయశాంతిని బరిలో దింపుతారన్న ప్రచారం కూడా ఉంది.
మెదక్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి పాలైన విజయశాంతి ఈసారి ఇక్కడ పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం అరడజను మంది పేర్లు వినిపిస్తున్నాయి. భట్టి జగపతి, కంఠారెడ్డి, తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, ముక్తార్, మ్యాడం బాలకృష్ణ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తన ఓటమికి మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్రెడ్డి కారణమని భావిస్తున్న విజయశాంతి ఈసారి ఆయనకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడ నుంచి గజ్వేల్ మజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇక్కడ నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. టిక్కెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తుంది. ఇక అధికారపార్టీ అభ్యర్ధిగా మరోసారి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి బరిలో దిగుతున్నారు. ఇక్కడ కొంత అధికారపార్టికే అనుకూల వాతావరణం కనిపిస్తుంది.నారాయణఖేడ్ తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడి కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, సంజీవ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఉప ఎన్నికలో ఓటమిపాలైన సంజీవరెడ్డి.. టికెట్ కోసం పట్టుపడుతున్నారు. అయితే అధిష్టానం మాజీ ఎంపీ షెట్కార్ నే బరిలో దింపే చాన్స్ ఉంది. ఇక్కడ ఇరు పార్టీల మధ్య హోరాహోరో పోరు తప్పేట్లు లేదు.
పటాన్చెరులో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఇక్కడి కాంగ్రెస్ టికెట్ కోసం డజను మంది ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన నందీశ్వర్గౌడ్ టీడీపీలో చేరారు. మహాకూటమి కోటాలో సీటు తనకేనని ప్రచారం చేసుకుంటుండగా కాంగ్రెస్ లో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న నేతలు తమలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గ్రూప్ తగాదాలే తమని బయటపడేస్తాయన్న ధీమాతో ఉంది అధికారపార్టీ. సిద్దిపేటలో గత ఎన్నికల్లో ఏకంగా 93,328 ఓట్ల మెజారిటీతో నెగ్గిన హరీశ్ పై పోటీకి ఈసారి కాంగ్రెస్ నుంచి టి.శ్రీనివా్సగౌడ్, దరిపల్లి చంద్రం, ఎల్.ప్రభాకర్ వర్మ, పూజల హరికృష్ణ రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిన శ్రీనివా్సగౌడ్కు పొన్నం ప్రభాకర్, చంద్రంకు రేవంత్రెడ్డి, ప్రభాకర్ వర్మకు వీహెచ్ మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం హరీశ్ మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉంది.
ఆందోల్ నియోజకవర్గం ముక్కోణపు పోరుకి తెర తీసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్ (కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనుండగా తాజా మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయనను బీజేపీ తన అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇక, జర్నలిస్టు యూనియన్ నాయకుడు క్రాంతికిరణ్ను టీఆర్ఎస్ ఎంపిక చేసింది. దాంతో, ముగ్గురి మధ్య నువ్వానేనా అనే పోరు సాగనుంది. సంగారెడ్డి టికెట్ తనకేనన్న నమ్మకంతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రచారం చేస్తున్నారు. మానవ అక్రమ రవాణాలో ఇటీవల అరెస్టై బయటకు వచ్చిన ఆయన.. పోటీకి తనకు ఇబ్బందులు ఎదురైతే భార్య నిర్మలను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించాలని భావిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇప్పటికే టీఆర్ఎస్ తరఫున ప్రచారంలో ఉన్నారు.