తూర్పుగోదావరిజిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేగానే ఉంటూ నియోజకవర్గంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాష్ట్రమంతా బహిరంగంగానే ఆ విషయం చెబుతున్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. నియోజకవర్గంలో గెలిపించిన పార్టీ వాళ్లు వదిలేశారు. పంచన చేరిన పార్టీ వాళ్లు పట్టించుకోవడం మానేశారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా మారారు.

వైసీపీకి అనుబంధంగా మరిన రాపాకకు రాజోలు నియోజకవర్గంలోని జనసేనపార్టీ నేతలు, కార్యకర్తలు దూరమయ్యారు. వైసీపీ కార్యకర్తలు ఏమైనా దగ్గరయ్యారా అంటే అదీ లేదు. మొదట్లో రాజోలు నియోజకవర్గం వైసీపీ కో ఆర్డినేటర్గా ఉన్న బొంతు రాజేశ్వరరావుకు అధిష్ఠానంతో చెక్ పెట్టించారు రాపాక. తరువాత రాజోలు కో ఆర్డినేటర్గా కొనసాగిన తుని నియోజకవర్గానికి చెందిన ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ పెత్తనం చెలాయించారు. కో-ఆర్డినేటర్లతో విభేదాలకు వెళ్లి.. ఎమ్మెల్యే రాపాక అధిష్ఠానం వద్ద మళ్లీ పంచాయితీ పెట్టించారు. దీంతో అమ్మాజీ సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం పేరుకే అమ్మాజీ కో-ఆర్డినేటర్ తప్ప పెత్తనం లేదు.
కుమారుడిని సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చించి రాజోలు వైసీపీకి అంతా తనేనని చెప్పుకొని తిరుగుతున్నారు రాపాక. అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం రాపాక దరి చేరడం లేదు. జనసేనలో నెంబర్ వన్, వైసీపీలో 152వ ఎమ్మెల్యే అయినా రాజోలులో మాత్రం రాపాక ఒంటరయ్యారట. ప్రస్తుతం వైసీపీకి మద్దతుదారుడిగానే రాపాక కొనసాగుతున్నారు. వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీ తొలిరోజే సీఎం జగన్ను కలుసుకోవడంతో వైసీపీలో చేరిపోయారనే ప్రచారం సాగింది. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక… 2019లో రెండవసారి జనసేన నుంచి గెలుపొందారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న రాపాక ఆసాకుతో రాజోలు వైసీపీలో రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అటు జనసేన, ఇటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాపాకకు దూరమయ్యారు.